18 April 2011

రాజకీయాల్లో వై.ఎస్.జగన్‌కే విశ్వసనీయత: పోసాని కృష్ణ

మాజీ పార్లమెంట్ సభ్యుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై తెలుగు సినీ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి ప్రశంసల వర్షం కురిపించారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత ఉందని పోసాని చెప్పారు. వైఎస్సార్, ఎన్టీఆర్‌లు ఇచ్చిన వాగ్ధానానికి కట్టుబడి ఉంటారని పోసాని వెల్లడించారు. జగన్‌ను నమ్ముకుంటే చివరి వరకు నమ్మినోళ్ల వెంట ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు.

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ అవినీతిని నిరూపిస్తే తన తల నరుక్కుంటానని పోసాని సవాలు చేశారు. ఇప్పుడు రాజకీయాల్లో వైయస్ జగన్ మాత్రమే మంచివాడని మీడియా ప్రతినిధులతో తెలిపారు. ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు, వైయస్సార్ కుటుంబ సభ్యులు మాత్రమే నిజాయితీపరులని ఆయన అన్నారు.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నిజాయితీ లేదని, నందమూరి హరికృష్ణ వంటి ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో మాత్రమే నిజాయితీ ఉందని, బతికి ఉంటే తాను ఎన్టీ రామారావుతో ఉండేవాడినని పోసాని వెల్లడించారు.

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి వ్యక్తిగతంగా మంచివాడని, అయితే జెండా, పార్టీ కార్యాలయం మూసేశారని, తాను తిట్టిన కాంగ్రెసులోనే చేరుతున్నారని, అందువల్ల చిరంజీవికి నిజాయితీ కొరవడిందని ఆయన అన్నారు. చిరంజీవిని ప్రజలు నమ్మడం లేదని ఆయన అన్నారు. నిద్ర మేల్కొనే లోపే చిరంజీవి పార్టీ కనుమరుగైందని పోసాని వ్యాఖ్యానించారు.


0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us