11 April 2011

కడపకు ఢిల్లీకి యుద్ధం:వైఎస్ జగన్

వైఎస్సార్ జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికలు కడపకూ ఢిల్లీకీ మధ్య జరుగుతున్న మహా యుద్ధమని వైఎస్సార్ పార్టీ అధినేత, కడప లోక్‌సభ స్థానం అభ్యర్థి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగే మార్పులకు కడప జిల్లాలో జరిగే ఉప ఎన్నికలే నాంది కానున్నాయని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షోల్లో ఆయన ప్రసంగించారు. ఈ ఎన్నికలు న్యాయానికి- అన్యాయానికి, ఆత్మగౌరవానికి- అహంకారానికి, విశ్వసనీయతకు- వంచనకు, దివంగత నేత వైఎస్సార్‌కు- సోనియా గాంధీకి మధ్య జరుగుతున్నాయని పునరుద్ఘాటించారు. ఆత్మగౌరవం, సచ్ఛీలత తనలో లేకపోయి ఉంటే కేంద్రంలో మంత్రి పదవి వచ్చి ఉండేదని, అసలు ఈ ఎన్నికలు వచ్చేవి కావని అన్నారు.

మహానేత వైఎస్‌ఆర్ బిడ్డను కాబట్టి అలా చేయలేకపోయానన్నారు. రాముడి రాజ్యమైతే నేను చూడలేదు కాని వైఎస్సార్ స్వర్ణయుగాన్ని చూశానన్నారు. అలాంటి స్వర్ణయుగ పాలనను తీసుకురావడం కోసం ప్రజల అభిమతం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశానని ప్రజలకు వివరించారు. వైఎస్సార్ పాదాల చెంత, పేదవాడి నవ్వులనుండి రూపు దిద్దుకుందన్నారు. మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత పార్టీ నుండి తనను బయటకు పంపే పరిస్థితిని కల్పించారని, కుటుంబాన్ని నిలువునా చీల్చారని గుర్తుచేశారు.

Congress, Y.S.Jagan, YSR Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us